దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక అడుగు వేశారు. ఇప్పటికే కోల్కతా వెళ్లి బెంగాల్ సీఎం మమతాబెనర్జీతో చర్చలు జరిపిన కేసీఆర్ ఇవాళ బెంగళూర్ వెళ్లి మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ సమావేశమయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతను వివరించిన కేసీఆర్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అలాగే ప్రస్తుత దేశ రాజకీయాలపై దేవెగౌడ, కేసీఆర్ మాట్లాడుకున్నారు. ఇక కేసీఆర్ వెంట సినీ నటుడు ప్రకాశ్ రాజ్, ఎంపీలు వినోద్, సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో దేవెగౌడతో కేసీఆర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తోన్న దేవెగౌడకు బాసటగా నిలవాలన్న ఉద్దేశంతోనే ఈ టైమ్లో కేసీఆర్ కలిసినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఒక ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి బెంగళూర్ వెళ్లి మద్దతు ప్రకటించడం వల్ల దేవెగౌడ పార్టీకి మేలు జరుగుతుందని, కర్నాటకలోని తెలుగువాళ్లు జేడీఎస్ వైపు మొగ్గుచూపే అవకాశముందని అంటున్నారు. అదే సమయంలో కేసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణానికి కూడా ఈ భేటీ ఉపకరిస్తుందని భావిస్తున్నారు.
ఇక రైతు పెట్టుబడి సాయం పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్కి దేవెగౌడ అభినందనలు తెలిపినట్లు తెలుస్తోంది. గతంలోనే కేసీఆర్కి ఫోన్ చేసి అభినందించిన దేవెగౌడ ఇప్పుడు స్వయంగా అప్రిషీయేట్ చేసినట్లు చెబుతున్నారు. ఇక కర్నాటకలో హంగ్ ఏర్పడుతుందని కొన్ని సర్వేలు చెబుతున్నందున నెక్ట్స్ సర్కార్ ఏర్పాటులో దేవెగౌడ కీలక పాత్ర పోషించే అవకాశముందని భావిస్తున్నారు. ఒకవేళ దేవెగౌడ కింగ్ మేకర్గా మారితే మాజీ ప్రధాని హోదాలో కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశముందని అంచనా వేస్తున్నారు.