జనసేన అధినేత పవన్ కల్యాణ్కు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ధర్మపోరాట దీక్ష వేదికపైన ఆయనకు పరోక్షంగా చురకలు అంటించారు. ఎవరి వ్యక్తిత్వాన్ని కించపరచే అలవాటు లేదన్న చంద్రబాబు పవన్ కల్యాణ్ తన దీక్షను పక్కదోవ పట్టించే యత్నం చేశారని ఆరోపించారు. అటు మంత్రి లోకేష్ కూడా జనసేనాని ట్వీట్లపై స్పందించారు.
ఏపీ సెక్రటేరియట్ వేదికగా తనపై వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర జరిగిందని దీనికి లోకేషే సూత్రధారంటూ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై చంద్రబాబు స్పందించారు. దర్మ పోరాట దీక్షలో మాట్లాడిన సీఎం ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. తాను విలువలతో కూడిన రాజకీయం చేస్తానని అన్నారు. వ్యక్తిత్వాలను హననం చేసే పనులను టీడీపీ ఎప్పుడూ చేయదు అలాంటి చరిత్ర తమకు లేదన్నారు. తానెప్పుడూ మాట కూడా తూలలేదని గుర్తు చేశారు.
అంతేకాదు తాను చేసిన ధర్మపోరాట దీక్షను బలహీనపరచే ప్రయత్నం చేశారంటూ పవన్ని ఉద్దేశించి అన్నారు. వ్యక్తిగత సమస్యలపై స్పందనకు ధర్మదీక్ష ఉన్న రోజే సమయం దొరికిందా అని ప్రశ్నించారు. ఆ దీక్షకు ముందు రోజో ఆ తర్వాతో స్పందించవచ్చు కదా అని నిలదీశారు. వ్యక్తి గత సమస్యలుంటే తాను పరిష్కారం చూపుతానని చంద్రబాబు అన్నారు.
ఇక మంత్రి లోకేశ్ కూడా పవన్ ట్విట్టర్ కామెంట్స్పై ట్విట్టర్లోనే స్పందించారు. ‘పవన్ వ్యాఖ్యలు చాలా బాధించాయన్న లోకేష్ ఇంతకు ముందు కూడా తనపై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ ఎవరో చెపితే అన్నానన్నారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం. ఎవరో అన్న, విన్న మాటల ఆధారంగా ఆరోపణలు చేసే కుసంస్కారిని కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలన్నిటినీ కాలమే ప్రజల ముందు ఉంచుతుంది. మీ పట్ల నా హృదయంలో గౌరవ స్థానమే ఉంటుంది. మాతృదేవోభవ..అంటూ ట్వీట్ చేశారు.