Vijayawada: దీపిక మృతి కేసులో సంచలన మలుపు.. సీనియర్ డాక్టర్ అమర్ సహస్ రెడ్డి అరెస్ట్!
Vijayawada: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గత నెలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన అనస్తీషియా పీజీ విద్యార్థిని బత్తుల దీపిక కేసును పోలీసులు ఛేదించారు.
Vijayawada: దీపిక మృతి కేసులో సంచలన మలుపు.. సీనియర్ డాక్టర్ అమర్ సహస్ రెడ్డి అరెస్ట్!
Vijayawada: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గత నెలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన అనస్తీషియా పీజీ విద్యార్థిని బత్తుల దీపిక కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ఆమె సీనియర్, నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అమర్ సహస్ రెడ్డిని మాచవరం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. దీపికను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు తేలడంతో పోలీసులు సెక్షన్లను మార్చి, అతడికి 14 రోజుల రిమాండ్ విధించారు.
ప్రేమించి.. పెళ్లికి నిరాకరించి..
పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. హైదరాబాద్ బాచుపల్లికి చెందిన అమర్ సహస్ రెడ్డి, దీపిక గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, అమర్ గతంలో విశాఖపట్నంలో ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలో తన బ్యాచ్మేట్ను కూడా ప్రేమించాడు. ఇటీవల సదరు యువతిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్న అమర్, దీపికను దూరం పెట్టడం ప్రారంభించాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదం జరిగేది.
మరణానికి ముందు 2 గంటల ఫోన్ కాల్:
దీపిక మరణించిన రోజు రాత్రి 10:40 నుంచి అర్ధరాత్రి 12:30 గంటల వరకు అమర్, దీపిక మధ్య సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ జరిగింది. "నా పెళ్లి ఖాయమైంది.. నిన్ను పెళ్లి చేసుకోలేను" అని అమర్ తెగేసి చెప్పడమే కాకుండా, ఆమె వేడుకున్నా కనీసం విజయవాడ రావడానికి కూడా నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దీపిక, ఆపరేషన్ థియేటర్లో రోగులకు మత్తు ఇచ్చే సమయంలో వాడే కండరాల రిలాక్సేషన్ ఇంజక్షన్ను స్వయంగా ఇచ్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తండ్రిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం:
దీపిక తండ్రి కోదండరామిరెడ్డి రెండు రోజుల క్రితం నందిగామ ఆసుపత్రికి వెళ్లి అమర్ను నిలదీయగా.. ఏదో కేసు విషయమై దీపిక తనకు ఫోన్ చేసిందని, అంతకు మించి తనకు ఏమీ తెలియదని అమర్ అబద్ధం చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ, ఫోరెన్సిక్ నివేదిక మరియు కాల్ డేటా ఆధారంగా పోలీసులు అమర్ను నిందితుడిగా తేల్చి కటకటాల్లోకి నెట్టారు.