చిత్తూరు జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. అమాయకుడైన రైతుపై చౌడేపల్లి ఎస్ఐ, సిబ్బంది దాడి చేయడంతో బాధితుడు కోమాలోకి వెళ్లిపోయాడు. సోమల గ్రామానికి చెందిన గణేశ్ అగ్రికల్చర్లో బీఎస్సీ చేశాడు. వ్యవసాయంలో డిగ్రీ చేయడంతో రైతుగా స్థిరపడ్డారు. తాను పండించిన టమోటను అమ్ముకునేందుకు చౌడేపల్లి మార్కెట్ బయలుదేరాడు.
చౌడేపల్లి వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు రైతు గణేశ్ను ఆపారు. నిబంధనలు పాటించకుండా వెళ్తునందున ఫైన్ కట్టాలంటూ ఎస్ఐ, సిబ్బంది గణేశ్కు చెప్పారు. తానేం తప్పు చేయలేదని 150 రూపాయలు ఫైన్ కట్టబోనంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో రెచ్చిపోయిన పోలీసులు తమకే ఎదురు తిరుగుతావా అంటూ ఇష్టమొచ్చినట్లు చితక్కొట్టారు.
పోలీసులు బాగా కొట్టడంతో రైతు గణేశ్ అక్కడికక్కడే కుప్పుకూలిపోయాడు. స్థానికులు పుంగనూరు ఆసుపత్రికి తరలించినా పరిస్థితి మెరుగు పడలేదు. పుంగనూరు నుంచి గణేశ్ను మదనపల్లె, తర్వాత తిరుపతికి తరలించారు. పోలీసు దెబ్బలకు గణేశ్ కోమాలోకి వెళ్లిపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనపై విచారణ చేపట్టారు.