సరదాకోసం వెళ్లిన ఓ వ్యక్తిని పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాకు చెందిన వ్యక్తిగా అనుమానించి చంపేశారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. హైదరాబాద్లోని పహాడీషరీఫ్ ఎర్రకుంట ప్రాంతానికి చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ మహ్మద్ ఆజం(32) ముగ్గురు స్నేహితులతో కలిసి కర్ణాటక వెళ్ళాడు. బీదర్ జిల్లా ఉద్గీర్కు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం సమయంలో స్థానిక చిన్నారులకు విదేశీ చాక్లెట్లిచ్చారు.ఇది చూసిన స్థానికులు వారిని పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాగా అనుమానించి వారిపై తీవ్రంగా దాడి చేశారు. దాంతో ఆజం అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.