ఎలాగైనా నటుడిగా నిరూపించుకోవాలన్న లక్ష్యంతో దొరికిన పాత్రలన్నీ చేస్తూ, టీవీ సీరియల్స్ లో నటిస్తూ, జబర్దస్త్ కార్యక్రమంలో నవ్వించిన సాదా సీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్... అది నిన్నటి వరకూ. నేడు శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ కోట్లకు పడగలెత్తాడు. అంతేకాదు, ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు హీరోగా నటించగా, ఇటీవలే విడుదలైన చిత్రానికి ఫైనాన్స్ కూడా అందించాడు. తిరుపతికి చెందిన ఈ వ్యక్తి గురించి పక్కా ఆధారాలు లభ్యంకావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇతని కోసం గాలిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకలోని స్మగ్లర్ల ద్వారా బడా స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. ఎర్రచందనం దుంగలను తరలిస్తూ రూ.కోట్లకు పడగలెత్తాడు. టాస్క్ఫోర్స్ అధికారులకు పక్కా ఆధారాలు లభించాయి. దాంతో అతనిపై సుమారు 20 కేసులు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నట్లు టాస్క్పోర్స్ అధికారులు తెలిపారు. ఇటీవల విడుదలైన ఓ సినిమాకు ఫైనాన్స్ చేసిన వ్యక్తి కూడా ఇతనేనని స్పష్టం చేశారు. మరికొన్ని సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నట్లు తెలిసింది. ఇతనితో పాటు మరి కొందరు విద్యార్థులు, చిన్న చిన్న డాక్టర్లు, ఇంజినీర్లు, ప్రైవేటు ఉద్యోగులను అక్రమ రవాణాలో భాగస్వాములు చేసుకున్నట్లు సమాచారం.