సెల్ఫోన్కు ఛార్జింగ్ పెడుతూ ప్రమాదవశాత్తు వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా రాపూరు మండలం గిలకపాడులో జరిగింది. గ్రామానికి చెందిన చలంచర్ల మణి(36) మంగళవారం రాత్రి తన సెల్ ఫోన్కు చార్జింగ్ పెట్టేందుకు చార్జర్ను తీసుకున్నాడు. ప్లగ్ లో పెట్టి పిన్ ఫోన్ కు పెట్టాడు అంతే ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టింది. ఇంతలో అయన భార్య చూసి కరెంటు స్విచ్ ఆఫ్ చేసి.. వెంటనే ఇరుగు పొరుగు వారిని పిలిచింది. అయితే ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా మధ్యలోనే మణి ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహానికి డాక్టర్ల చేత పోస్టుమార్టం నిర్వహించారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రమాదవశాత్తు మణి చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.