తెలంగాణ రాష్ట్రంలో బీరు ధరలు పెరగనున్నాయి.. ఈ మేరకు రేట్ కాంట్రాక్ట్ అండ్ నెగోషియేషన్స్ కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసును ప్రభుత్వం కూడా ఆమోదించనున్నట్టు సమాచారం.. గత కొన్ని రోజులుగా బీరు ధరలు పెంచాలని కంపెనీల యజమాన్యాలు ప్రభత్వాన్ని కోరుతున్నాయి. తాజాగా బీరు ధరల పెంపు దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం కాంట్రాక్ట్ అండ్ నెగోషియేషన్స్ కమిటీని ఏర్పాటు చేసి గరిష్టంగా ఎంతపెంచాలో సూచనలు కోరింది. ఆ కమిటీ నిర్ణయం ప్రకారం లాగర్ (లైట్) బీరుపై 9 శాతం, స్ట్రాంగ్ బీరుపై 10 శాతం మేర పెంచాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం తెలంగాణాలో అమలవుతున్న ధరలు ఇలా వున్నాయి.. లైట్ బీర్ రూ. 90 , స్ట్రాంగ్ బీరు రూ.100 ఉంది. కమిటీ సిఫారసుల ప్రకారం 9 నుంచి 10 రూపాయలు పెరగనున్నాయి. ఇక ధరల పెంపు సిఫారసులతో కూడిన సీల్డు కవరును ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శికి పంపింది. ఎక్సైజ్ శాఖ పరిశీలించిన అనంతరం తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్కు ఫైలు చేరుతుంది. అందులోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ సిఫారసులను పరిశీలించిన తరువాత అవి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళతాయి. ఫైనల్ గా ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ సిఫారసులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.