పంట రుణం కోసం తన భర్తతో కలిసి బ్యాంకుకు వెళ్లిన ఓ రైతు భార్యను ఆ బ్యాంక్ మేనేజర్ అడగరాని కోరిక అడిగాడు. తాను చెప్పినట్టు వింటే అడిగినంత రుణం మంజూరు చేస్తానని ఆశ చూపాడు. రైతు భార్య ఫిర్యాదుపై బుల్దానా జిల్లా మల్కాపూర్ తహసిల్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్పై పోలీసులు శుక్రవారంనాడు కేసు నమోదు చేశారు. బుల్దానా జిల్లా మల్కాపూర్ మండలంలో నివసిస్తున్న రైతు దంపతులు.. లోన్ కోసం జిల్లా కేంద్రంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించారు. అయితే బ్యాంక్ మేనేజర్ రాజేష్ హివాసె సదరు మహిళపై కన్నేశాడు. లోన్ దరఖాస్తులోని ఆమె ఫోన్ నంబర్కు ఫోన్కాల్ చేసి ‘కోరిక తీర్చాలంటూ’ వేధించాడు. అయితే లోన్ జారీఅయ్యే సమయంలో గొడవ కావటం ఇష్టం లేని ఆమె విషయాన్ని భర్తకు చెప్పలేదు. ఈ దశలో లోన్ను హోల్డ్లో పెట్టిన రాజేష్.. తన అటెండర్ను సదరు మహిళ ఇంటికి పంపి రాయబారం నడపాలని యత్నించాడు.
రుణంతోపాటు అదనంగా లాభాలు, కొంత ప్యాకేజీ కూడా మేనేజర్ ద్వారా ఇప్పిస్తానని సదరు ప్యూన్ ఆమెతో చెప్పాడు. అతని మాటలు వినగానే ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. వెంటబడి రోకలిబండతో అతన్ని తరిమి కొట్టింది. స్థానికులు గుమిగూడటంతో ఆ అటెండర్ అక్కడి నుంచి దౌడుతీశాడు. రాజేష్ కాల్ రికార్డింగ్స్తోసహా పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ దళితురాలు కావటంతో అట్రాసిటీ కేసు, లైంగిక వేధింపుల కేసులు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న మేనేజర్ రాజేశ్, అటెండర్ల కోసం గాలింపు చేపట్టారు.