మరోసారి మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ జిల్లా బీజాపూర్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది నక్సలైట్లు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు నలుగురు యువకులు ఉన్నారు. బైలాడిల్లా సమీపంలోని అటవీ ప్రాంతంలో దండకారణ్య సబ్ జోనల్ హెడ్ గణేష్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడనే సమాచారం మేరకు సుమారు 200 మంది జవాన్లు రెండ్రోజుల క్రితం కూంబింగ్కు వెళ్లారు. ఈ క్రమంలో వారు ఎనిమిది బృందాలుగా విడిపోయారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లిన జవాన్లకు తీమ్నార్ ప్రాంతంలో గురువారం ఉదయం 6 గంటలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. కాల్పులు జరిగిన సమయంలో ఒకరిద్దరు నక్సలైట్లు తప్పించుకోగా..దాడిలో ఎనిమిది మంది నక్సల్స్ హతమయ్యారని యాంటీ నక్సల్స్ ఆపరేషన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి.సుందర్రాజ్ తెలిపారు.