UPI Revolution: యూపీఐ సరికొత్త రికార్డు రూ. 230 లక్షల కోట్లతో భారత్ గ్లోబల్ డిజిటల్ లీడర్

UPI Revolution: జేబులో చిల్లిగవ్వ లేకపోయినా.. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు, ఈ దునియా నీదే. ఇది నేటి భారతీయ సామాన్యుడి ధీమా..

Update: 2026-02-05 06:06 GMT

UPI Revolution: యూపీఐ సరికొత్త రికార్డు రూ. 230 లక్షల కోట్లతో భారత్ గ్లోబల్ డిజిటల్ లీడర్

జేబులో చిల్లిగవ్వ లేకపోయినా.. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు, ఈ దునియా నీదే. ఇది నేటి భారతీయ సామాన్యుడి ధీమా. ఒకప్పుడు బ్యాంకుల ముందు క్యూలు కట్టి, నగదు కోసం తల్లడిల్లిన దేశం.. నేడు ప్రపంచానికే డిజిటల్ పాఠాలు నేర్పిస్తోంది. అందుకు నిదర్శనమే రాజ్యసభ సాక్షిగా వెల్లడైన ఈ కళ్లు చెదిరే గణాంకాలు.

ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ వెల్లడించిన వివరాలు చూస్తుంటే, భారత్‌లో నగదు లావాదేవీల కాలం చెల్లిందనిపిస్తోంది.2025-26 ఆర్థిక సంవత్సరంలో కేవలం డిసెంబర్ నాటికే యూపీఐ లావాదేవీల విలువ రూ. 230 లక్షల కోట్లకు చేరింది. 2022-23లో రూ. 139 లక్షల కోట్లుగా ఉన్న ఈ విలువ, కేవలం రెండేళ్ల వ్యవధిలో దాదాపు రెట్టింపు అవ్వడం చూస్తుంటే సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు ప్రతి ఒక్కరూ స్కాన్ అండ్ పే మంత్రాన్ని ఎంతలా నమ్ముతున్నారో అర్థమవుతోంది.

హైటెక్ షోరూమ్‌ల కంటే, గల్లీలోని టీ కొట్టు వద్ద, రోడ్డు పక్కన కూరగాయల బండి దగ్గర జరుగుతున్న చిల్లర చెల్లింపులే ఈ భారీ విజయానికి అసలైన కారణం.యూపీఐ ఇప్పుడు కేవలం దేశ సరిహద్దులకే పరిమితం కాలేదు. ఇది ఒక అంతర్జాతీయ బ్రాండ్‌గా అవతరించింది.ప్రస్తుతం ఎనిమిది విదేశీ దేశాల్లో భారతీయ యూపీఐ జయకేతనం ఎగురవేస్తోంది. ఇతర దేశాల్లోని ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్‌తో యూపీఐని అనుసంధానించడం ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులకు, పర్యాటకులకు నగదు కష్టాలను దూరం చేయాలని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.

విదేశీ వ్యాపారులకు సైతం మన యూపీఐ ద్వారా సులభంగా పేమెంట్స్ చేసే వెసులుబాటు కల్పించడం ద్వారా, అంతర్జాతీయ వాణిజ్యంలోనూ భారత్ తన పట్టును నిరూపించుకుంటోంది. ఒకప్పుడు విదేశీ టెక్నాలజీపై ఆధారపడ్డ మనం, నేడు సొంతంగా అభివృద్ధి చేసుకున్న టెక్నాలజీతో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాం. ఈ రూ. 230 లక్షల కోట్ల విలువ వెనుక ఉన్నది కేవలం అంకెలు మాత్రమే కాదు.. భారత ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రజలకున్న నమ్మకం , డిజిటల్ విప్లవంలో భారత్ సాధించిన ఘన విజయం.

Tags:    

Similar News