Petrol, Diesel Prices May Spike: వాహనదారులకు షాక్ తప్పదా? ఫిబ్రవరి 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు!
కేంద్ర బడ్జెట్ 2026కు ముందు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎక్సైజ్ సుంకం పెంచడం ద్వారా రూ. 70,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ.
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2026కు ముందే వాహనదారులకు చేదు వార్త అందేలా కనిపిస్తోంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఎం ఫైనాన్షియల్ (JM Financial) తన తాజా నివేదికలో హెచ్చరించింది.
లీటరుకు రూ. 3 - 4 పెరిగే ఛాన్స్!
కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక లోటును అధిగమించేందుకు పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని (Excise Duty) లీటరుకు 3 నుంచి 4 రూపాయల వరకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వం ఎందుకు పెంచుతోంది?
దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి:
- ప్రభుత్వ ఆదాయంలో లోటు: 2025 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ప్రభుత్వ ఆదాయ వసూళ్లు అంచనాల కంటే తక్కువగా (56%) ఉన్నాయి. ఆర్థిక లోటు లక్ష్యాన్ని 4.4 శాతానికి చేర్చాలనే ఒత్తిడి ప్రభుత్వంపై ఉంది.
- చమురు కంపెనీల అధిక లాభాలు: అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $61 వద్ద స్థిరంగా ఉంది. దీనివల్ల చమురు మార్కెటింగ్ కంపెనీల (OMCs) మార్జిన్లు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం లీటరుకు రూ. 10.60 మార్జిన్ ఉండగా, సగటున ఉండాల్సింది రూ. 3.50 మాత్రమే. ఈ అదనపు లాభాన్ని సుంకం రూపంలో ప్రభుత్వం తన ఖాతాలోకి మళ్లించుకోవాలని చూస్తోంది.
ధరలు పెంచడం వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి?
బ్రోకరేజ్ సంస్థ లెక్కింపు ప్రకారం:
పెట్రోల్, డీజిల్పై లీటరుకు కేవలం రూ. 1 పెంచితే, ప్రభుత్వానికి ఏటా రూ. 17,000 కోట్ల ఆదాయం వస్తుంది.
ఒకవేళ లీటరుకు రూ. 3 - 4 పెంచితే, ఏకంగా రూ. 50,000 నుంచి 70,000 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరుతుంది.
సామాన్యులపై ప్రభావం:
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే అది కేవలం వాహనదారులకే కాకుండా, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.