2030 నాటికి సూపర్ పవర్‌గా భారత్‌

2030 నాటికి సూపర్ పవర్‌గా భారత్‌

Update: 2022-12-20 16:00 GMT

2030 నాటికి సూపర్ పవర్‌గా భారత్‌

India: ఉక్రెయిన్‌ యుద్ధం ప్రంపచ దేశాలను వణికిస్తోంది... ఆర్థికంగా అగ్రదేశాలు కూడా కుదేలవుతున్నాయి...రోజు రోజుకు వృద్ధి క్షీణిస్తోంది. ఆర్థిక మాంద్యం భయం వెంటాడుతోంది. స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అప్పుల్లో కూరుకుపోతున్నాయి. ఇప్పటికే మాంద్యంలో చిక్కుకున్నట్టు బ్రిటన్‌ ప్రకటించింది. వచ్చే ఏడాదిలోగా పలు దేశాలు సంక్షోభంలో కూరుకుపోతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. కానీ ఓ దేశంలో మాత్రం అందుకు భిన్నంగా అభివృద్ధి పరుగులు పెడుతోంది. రిచ్‌ కంట్రీస్‌ జాబితాలో ఏడు స్థానంలో ఉన్న ఆ దేశం.. 2030 నాటికి సూపర్‌ పవర్‌గా.. చైనా, అమెరికాను సవాల్‌గా పరిణమించనున్నది. ఇంతకు ఆ దేశం ఏది? విపత్కర పరిస్థితుల్లో ఆర్థికంగా ఎలా నిలదొక్కుకుంది?

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం... పలు అభివృద్ధి చెందుతున్న దేశాల పాలిట శాపంగా మారింది. ఫిబ్రవరి 24న ఉన్నట్టుండి ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపడుతున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ప్రకటించాడు. ఉక్రెయిన్‌పై దాడిని పశ్చిమ దేశాలు వ్యతిరేకించాయి. మాస్కోపై భారీగా ఆంక్షలను విధించాయి. ఫలితంగా చమురు, ఆహార ధాన్యాల ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా స్తంభించిపోయాయి. ఫలితంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిత్యావసరాలు, చమురు, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ యుద్ధం తరువాతే శ్రీలంకలో పరిస్థితులు విషమించాయి. ప్రజలు ఆందోళన బాటపట్టారు. పాకిస్థాన్‌, నేపాల్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, లావోస్‌ వంటి దేశాలు విలవిలలాడుతున్నాయి. ఇవే పరిస్థితులు అగ్రదేశాల్లోనూ మొదలయ్యాయి. 2023 చివరి నాటికి అమెరికా ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బ్రిటన్‌ ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. రిచ్‌ కంట్రీలుగా పేరున్న జర్మనీ, జపాన్‌, చైనా దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగమనం దిశగా పయనిస్తున్నాయి. కరోనా నుంచి ఉపశమనం కలిగిందని ఊరట పొందుతున్న సమయంలో ఉక్రెయిన్ యుద్ధం రావడంతో పలు దేశాల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా పరిస్థితి మారింది. పలు దేశాల స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. నిత్యం నష్టాలనే మూటగట్టుకుంటున్నాయి. అమెరికా వడ్డీ రేట్లను పెంచడం డాలర్ మరింత స్ట్రాంగ్‌గా మారింది. దీంతో దిగుమతులకు అవసరమైన విదేశీ నిధులు చెల్లించలేక పలు దేశాలు చతికిలపడుతున్నాయి.

అంతర్జాతీయ పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. పలు దేశాలు అప్పుల్లో కూరుకుపోయినా.. భారత్‌ మాత్రం ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతోంది. ఆటోమొబైల్‌ రంగంలో భారీగా విక్రయాలు, పెరుగుతున్న పెట్టుబడులు, చమురు ధర స్థిరత్వం, డిజిటల్‌ మౌలిక సదుపాయాలను కల్పించడంతో భారత్‌కు కలిసివస్తోంది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధిని భారత్‌ నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో అయితే ఏకంగా 13.5 శాతం వృద్ధిని సాధించింది. అదే సమయంలో భారత స్టాక్‌ మార్కెట్లు ఫుల్‌ జోష్‌ మీద ఉన్నాయి. లాభాల బాటలో దూసుకుపోతున్నాయి. వాణిజ్యం, ఆర్థిక విధానాలు సరళీకరణ, విస్తారమైన మానవ వనరులు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. విదేశీ పెట్టుబడులకు, ఉత్పాదక శక్తికి కేంద్రంగా భారత్‌ మారుతోందని నిపుణులు చెబుతున్నారు. 2020లో భారత్‌ తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం-ప్లిస్‌తో ఉద్దీపనలు, పన్ను రాయితీలు, సత్వర లైసెన్స్ల్‌ మంజూరు వంటి సంస్కరణలను తీసుకొచ్చింది. ఈ విధానం సత్పలితాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. భారత్‌ తన ఎగుమతులతో అంతర్జాతీయ సప్లయ్‌ చైన్‌లో ప్రధాన పాత్ర పోషించేందుకు ప్లిస్‌ సహకరిస్తుందంటున్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు బహుళజాతి సంస్థలు గతంలో కంటే ఆసక్తి చూపుతున్నాయి. అందుకు కారణం భారత్‌లో వస్తు తయారీ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇతర దేశాలతో పోలిస్తే జనాభాలో యువత ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా విస్తారమైన మార్కెట్‌ ఉండడంతో పలు కంపెనీలు భారత్‌ బాటపడుతున్నాయి.

తాజా పరిణామాల నేపథ్యంలో ఈ దశాబ్దం చివరి నాటికి ఫ్యాక్టరీస్‌ హబ్‌గా భారత్‌ మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం స్థూల జాతీయోత్పత్తి-జీడీపీలో భారత తయారీరంగం వాటా.. 15.6 శాతంగా ఉంది. వచ్చే ఆరేళ్లలో ఇది 21 శాతానికి పెరుగుతుందని ఆర్థికవేత్తలు అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం తయారీ రంగంలో భారత ఆదాయం 44వేల 700 కోట్ల డాలర్లు. అయితే ఈ ఆదాయం 2031 నాటికి కాస్తా లక్ష 49వేల కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. తాజా నివేదికల ప్రకారం.. రిచ్‌ కంట్రీస్‌లో మొదటి స్థానంలో అమెరికా, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో జపాన్‌, నాలుగో స్థానంలో జర్మనీ, ఐదో స్థానంలో బ్రిటన్, ఆరోస్థానంలో భారత్‌ ఉంది. అయితే వచ్చే ఆరేళ్లలో జపాన్‌, జర్మనీ, బ్రిటన్‌ను వెనక్కి తోసి మూడో రిచ్‌ కంట్రీగా భారత్‌ అవతరిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా, చైనాతో పాటు సూపర్‌ పవర్‌గా భారత్‌ ఎదుగుతుందనంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. నిజానికి భారత్‌ ఎదుగుదలతో చైనాకే ముప్పుగా మారుతోంది. వరుస కోవిడ్ లాక్‌డౌన్లతో చైనా ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. భారత్‌లో 2021 చివరి నాటికే పరిస్థితులు చక్కబడ్డాయి. పారిశ్రామిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేసింది. అందుకు భిన్నంగా జిన్‌పింగ్ ప్రభుత్వం జీరో కోవిడ్‌ పాలసీతో.. ఫ్యాక్టరీలను మూసేసింది. కొన్నింటిని లాక్‌వేసుకుని నడిపించుకోవడానికి అనుమతించినా అవి కూడా విఫలమయ్యాయి. దీంతో పలు సంస్థలు ఇతర దేశాలకు వెళ్లిపోయేందుకు యత్నిస్తున్నాయి.

మరోవైపు అమెరికా, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు భారత్‌కు కలిసి వస్తున్నాయి. ఈ ఏడాది నవంబరులో అమెరికా ఆర్థికశాఖ మంత్రి జానెట్‌ ఎల్లెన్‌ భారత్‌ను సందర్శించారు. విశ్వసనీయమైన మిత్రదేశం భారత్‌తో వాణిజ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఎల్లెన్‌ తెలిపారు. యాపిల్‌ కంపెనీ చైనా నుంచి భారత్‌కు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తైవాన్‌ ఎలక్ట్రానిక్‌ కంపెనీ ఫాక్స్‌కాన్‌ ఇప్పటికే భారత్‌లోని వేదాంతతో కలిసి సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాయి. అందుకు ఏకంగా 19వందల 50 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెడుతున్నాయి. యాపిల్‌, ఫాక్స్‌కాన్‌తో పాటు మరికొన్ని సంస్థలు కూడా భారత్‌ వైపు చూస్తున్నాయి. ద్రవ్యోల్బణం రాకెట్‌ను తలపిస్తోందని.. ఇది పలు దేశాల ఆర్థిక వ్యవస్థలకు కృంగదీయనున్నట్టు ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఈ ప్రభావం భారత్‌పై పడే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు విద్య, ఆరోగ్యంపై పెట్టుబడులను పెంచాలని.. లేదంటే.. కొత్తగా పుట్టుకొచ్చే వైరస్‌లతో ముప్పు తప్పదని వార్నింగ్‌ ఇస్తున్నారు. కరోనా సృష్టించిన విలయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. వైరస్‌ కారణంగా అసంఘటిత కార్మిక రంగం పూర్తిగా దెబ్బతిన్నదంటున్నారు. ముఖ్యమంగా కార్మిక శక్లిలో మహిళల భాగస్వామ్యం పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ లోపాలను సరి చేసుకుంటే... వచ్చే ఆరేళ్లలో భారత్‌ రిచ్‌ కంట్రీగా మారడం ఖామంటున్నారు నిపుణులు. చైనాకు, అమెరికాకు జలక్ ఇచ్చినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు మరిన్ని సంస్కరణలు కూడా అవసరమని చెబుతున్నారు. అ దిశగా మోడీ ప్రభుత్వం కృషి చేయాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.  

Tags:    

Similar News