CNG Cars: సీఎన్జీ కార్ల హవా.. గత 5 ఏళ్లలో మూడు రెట్లు పెరిగిన మార్కెట్ వాటా
CNG Cars: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భారతదేశంలో ఫ్లెక్సీ ఫ్యూయల్ ఇంజిన్ల అవసరాన్ని చాలా కాలంగా నొక్కి చెబుతున్నారు. ఆయన ఇథనాల్, పెట్రోల్తో నడిచే వాహనాల గురించి ప్రస్తావించినప్పటికీ, వాస్తవానికి భారతదేశంలో ఒక రకమైన ఫ్లెక్సీ ఫ్యూయల్ కారు ఇప్పటికే ఉంది.
CNG Cars: సీఎన్జీ కార్ల హవా.. గత 5 ఏళ్లలో మూడు రెట్లు పెరిగిన మార్కెట్ వాటా
CNG Cars: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భారతదేశంలో ఫ్లెక్సీ ఫ్యూయల్ ఇంజిన్ల అవసరాన్ని చాలా కాలంగా నొక్కి చెబుతున్నారు. ఆయన ఇథనాల్, పెట్రోల్తో నడిచే వాహనాల గురించి ప్రస్తావించినప్పటికీ, వాస్తవానికి భారతదేశంలో ఒక రకమైన ఫ్లెక్సీ ఫ్యూయల్ కారు ఇప్పటికే ఉంది. ఇది పెట్రోల్ కార్లకు గట్టి పోటీనిస్తోంది. ఎలక్ట్రిక్ ,హైబ్రిడ్ వాహనాల నుంచి ఇప్పటికే పెను సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ కార్లకు ఇది నిజంగానే కష్టకాలం అని చెప్పొచ్చు.
ఫ్లెక్సీ ఫ్యూయల్ కారు మరేదో కాదు సీఎన్జీ కార్లే . సీఎన్జీ కార్లు 'కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్'తో నడుస్తాయి. ఒకవేళ వాహనంలో గ్యాస్ అయిపోతే వాటిని పెట్రోల్కు మార్చవచ్చు. ఇప్పుడు ఈ కార్ల మార్కెట్ వాటా వేగంగా పెరుగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా సీఎన్జీ కార్ల అమ్మకాలు వేగంగా పెరిగాయి. దీనివల్ల ఈ కార్ల మార్కెట్ వాటా కూడా పెరుగుతోంది. దీనికి ఒక పెద్ద కారణం సీఎన్జీ కార్ల మెరుగైన మైలేజే. ఒకవేళ పెట్రోల్ కారు లీటరుకు 15 నుంచి 16 కిలోమీటర్ల సగటును ఇస్తే, సీఎన్జీ కారులో ఇదే మైలేజ్ దాదాపు 10 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. అంటే కిలోమీటర్కు అయ్యే ఖర్చు చాలా తగ్గుతుంది.
గత కొన్ని సంవత్సరాలుగా సీఎన్జీ కార్ల ధరలు, వాటి రెట్రోఫిట్ కిట్ల ధరలు తగ్గాయి. అంతేకాకుండా, భారతదేశంలో చాలా కార్ల కంపెనీలు ఇప్పుడు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ కిట్లను అందించడం ప్రారంభించాయి. టాటా మోటార్స్ అయితే ఈ దిశగా ఒక అడుగు ముందుకేసి ట్విన్ సిలిండర్ టెక్నాలజీని ఆవిష్కరించింది. దీనివల్ల సీఎన్జీ కార్లలో బూట్ స్పేస్ సమస్య కూడా తీరిపోయింది.
సీఎన్జీ కార్ల మార్కెట్ వాటాను పరిశీలిస్తే, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం 6.3 శాతం మాత్రమే ఉండేది. కానీ గత 5 సంవత్సరాలలో ఇది దాదాపు మూడు రెట్లు పెరిగి, 2024-25లో 19.5 శాతానికి (19.5%) చేరింది. మరోవైపు, పెట్రోల్ కార్ల మార్కెట్ వాటా 76.3 శాతం నుండి 57.7 శాతానికి (57.7%) తగ్గింది. ఇది భారతదేశంలో ఇంధన వినియోగం ప్రాధాన్యతలు ఎలా మారుతున్నాయో స్పష్టం చేస్తుంది. ఇక ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే, మే 2025లో దేశంలో అమ్ముడైన మొత్తం కార్లలో 4.1 శాతం కార్లు ఎలక్ట్రిక్ వాహనాలే. గత సంవత్సరం వీటి అమ్మకాలు 2.6 శాతం మాత్రమే ఉండేవి. ఈ విధంగా చూస్తే, భారతదేశంలో ఈవీ అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. అయితే, పెట్రోల్-డీజిల్ కార్లతో పోలిస్తే ఇప్పటికీ వీటి సంఖ్య చాలా తక్కువగానే ఉంది. ఈ గణాంకాలు భారతదేశంలో ప్రజలు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేస్తున్నాయి.