తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్.. శ్రీకాకుళంలో నాణ్యమైన బియ్యం సరఫరా జరుగుతున్న తీరుతెన్నులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న సంచులను రీసైక్లింగ్ కోసం తిరిగి వెనక్కి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కలిగించాలని అధికారులకు సూచించారు. అలాగే కొత్త రేషన్కార్డుల జారీకి పనులు ప్రారంభించాలని కోరారు. డిసెంబర్ ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి.
ఎట్టిపరిస్థితుల్లో డిసెంబర్ నాటికి కొత్త రేషన్ కార్డులు రెడీగా ఉండాలన్నారు. ఇప్పటికే గ్రామ వాలంటీర్లు లబ్దిదారులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ ప్రక్రియ నవంబర్ చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో డిసెంబర్ నెలనుంచి నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని భావిస్తోంది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి కొడాలి నాని, సివిల్ సప్లైస్ కమిషనర్ కోన శశిధర్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.