'వెంకన్నతో పెట్టుకోవద్దు జగన్!'.. మండలిలో శ్రీవారి ఫోటోల అవమానంపై నారా లోకేశ్ ఫైర్
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య పతాకస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
'వెంకన్నతో పెట్టుకోవద్దు జగన్!'.. మండలిలో శ్రీవారి ఫోటోల అవమానంపై నారా లోకేశ్ ఫైర్
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య పతాకస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటాలను వైసీపీ ఎమ్మెల్సీలు అవమానించారంటూ రాష్ట్ర విద్యుత్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన హిందూవుల మనోభావాలను దారుణంగా దెబ్బతీసిందని ఆయన మండిపడ్డారు.
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై గత కొద్దిరోజులుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, శుక్రవారం వైసీపీ సభ్యులు శ్రీవారి చిత్రపటాలతో సభకు హాజరయ్యారు. అయితే, వారు అనుసరించిన తీరుపై లోకేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. "జగన్ గారూ.. శ్రీవారికి చేసిన మహాపాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు మరో మహాపరాధం చేస్తారా? మీ ఎమ్మెల్సీలు బూట్లు, చెప్పులు వేసుకుని స్వామివారి ఫోటోలు పట్టుకోవడం క్షమించరాని నేరం" అని లోకేశ్ ధ్వజమెత్తారు.
నిరసన ముగిశాక వైసీపీ సభ్యులు ఆ పవిత్ర చిత్రపటాలను గౌరవించకుండా, సభలోనే విసిరేసి వెళ్లడంపై లోకేశ్ తీవ్రంగా స్పందించారు. "దేవుడంటే భయం, భక్తి లేని వ్యక్తి జగన్. ఆయన డైరెక్షన్ లోనే వైసీపీ సభ్యులు హిందూ ధర్మాన్ని హేళన చేస్తున్నారు. కౌన్సిల్లో స్వామివారి ఫోటోలు వదిలేసి వెళ్లడం మీ అహంకారానికి నిదర్శనం. వేంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు" అని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు సభలో జరిగిన దృశ్యాల వీడియోను కూడా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల పవిత్రతను కాపాడటానికి చర్యలు తీసుకుంటుంటే, వైసీపీ మాత్రం రాజకీయ లబ్ధి కోసం దేవుడిని వాడుకుంటోందని లోకేశ్ ఆరోపించారు.