YS Jagan: గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన.. అంబటి రాంబాబు ఇంటికి వెళ్తున్న జగన్‌కు జననీరాజనం!

YS Jagan: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Update: 2026-02-04 09:04 GMT

YS Jagan: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని సందర్శించేందుకు వచ్చిన జగన్‌కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

ఇటీవల రాజకీయ ఘర్షణల నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే నేరుగా అంబటి నివాసానికి వెళ్లిన ఆయన, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.

వైఎస్ జగన్ రాకతో గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులు జనసంద్రంగా మారాయి. జగన్ కాన్వాయ్‌ వెంట భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఆయన కారుపై పూల వర్షం కురిపిస్తూ, నినాదాలతో హోరెత్తించారు. భారీగా జనం తరలి రావడంతో జగన్ కాన్వాయ్ చాలా నెమ్మదిగా కదిలింది.

వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచారు. ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తున్న స్పందన చూస్తుంటే వైఎస్సార్‌సీపీ కేడర్‌లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Full View


Tags:    

Similar News