శుభవార్త : ఈరోజు లేదా రేపు సచివాలయ పరీక్షల రిజల్ట్స్
గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల కోసం ఏపీ ప్రభుత్వం నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఈరోజు లేదా రేపు వెలువడే అవకాశం ఉంది.
లక్షలాది మంది ఉద్యోగార్థులు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయాలు ప్రవేశ పరీక్ష ఫలితాలు నేడు లేదా రేపు వెల్లడయ్యే అవకాశం ఉంది. వెయిటేజ్ మార్కులు కలిపే ప్రక్రియ బుధవారం సాయంత్రం వరకు పూర్తికాలేదు. దీంతో గురువారం ఉదయానికి ఈ ప్రక్రియ పూర్తయితే, సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 19 రకాల ఉద్యోగాల్లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్–5, రూరల్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వీఆర్వో, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులు మినహా ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నవారికి వారి సర్వీస్ కాలం ఆధారంగా వెయిటేజ్ మార్కులు కలపాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇక దశలవారీగా ఈనెల 1 నుంచి 8 వరకు జరిగిన ఈ పరీక్షల్లో ఎక్కడా అవకతవకలకు తావు లేకుండా పూర్తి చేశారు అధికారులు. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాల వ్యవస్థ ప్రారంభం కానుంది. అన్ని జిల్లాల్లో ఇన్చార్జి మంత్రుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.