సమగ్ర ప్రాజెక్టు నివేదికలను పరిశీలించండి : కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్
ఏపీ తెలంగాణ మధ్య కృష్ణ జలాల వివాదం ముదురుతోంది.
ఏపీ తెలంగాణ మధ్య కృష్ణ జలాల వివాదం ముదురుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి రోజూ 3 టీఎంసీల నీటిని మళ్లించేలా ఎత్తిపోతల పథకానికి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తీసుకోవడం కోసం శ్రీశైలం కుడిగట్టు కాలువ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా పనులు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తమ రాష్ట్ర హక్కులు కాపాడటానికి చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆయన ఏపీ చేపట్టిన కొత్త నీటి ప్రాజెక్టు సంబంధించి చర్చించేందుకు వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సూచించినట్లు గజేంద్ర సింగ్ తెలిపారు.
ప్రాజెక్టు పూర్తి నివేదికలను సాంకేతికంగా పరిశీలించాలని, అప్పటివరకు ప్రాజెక్టు నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ను కోరమని చెప్పామని తెలంగాణ ఎంపీ బండి సంజయ్ కుమార్కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఈ అంశాన్ని తమ మంత్రిత్వశాఖ పరిశీలించిందని, ఏపీ పునర్విభజన చట్టంలో రూల్స్ ఆధారంగా ప్రాజెక్టుల డీపీఆర్లను పరిశీలించాలని కృష్ణా బోర్డును సూచించినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి వివరణ బోర్డు వివరణ కోరిన సంగతి తెలిసిందే.