మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసు సంబంధించి ఇప్పటికే వైఎస్ కుటుంబీకులను సిట్ విచారించింది. తాజాగా సిట్ టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులకు కూడా నోటీసులు పంపించింది. సిట్ విచారణకు హాజరు కావాలని టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాధ్ రెడ్డి(బీటెక్ రవి)ని ఆదేశించింది. ఆయన ఇవాళ సిట్ ముందు హాజరు కానున్నారు. అలాగే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి కూడా సిట్ నోటీసులు పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరో వారం రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలను సిట్ బయటపెట్టే అవకాశం ఉందని సమాచారం. కాగా ఇప్పటికే ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డిని, ఆయన సోదరుడు వైఎస్ మనోహర్రెడ్డిని, టీడీపీకి చెందిన మాజీ జడ్పీటీసీ సబ్యడు పోరెడ్డి ప్రభాకర్, వివేకానందరెడ్డి ఇంట్లో పనిచేసే ప్రసాద్, ప్రకాశ్తో పాటు మరో ఇద్దరిని బుధవారం విచారించింది. కడప డీటీసీలో విచారణ కొనసాగుతోంది.