సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా టిటిడి ఉద్యోగుల సమగ్రతా ప్రతిజ్ఞ
అవినీతికి అస్కారం లేకుండా పని చేస్తాం, నిర్లక్ష్యానికి తావులేకుండా భక్తులకు సేవ చేస్తాం టీటీడీ కీర్తిప్రతిష్టలకు భంగం కలగకుండా విధులు నిర్వహిస్తాం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా టిటిడి ఉద్యోగుల సమగ్రతా ప్రతిజ్ఞ
(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)
స్వాతంత్ర్య సమరయోధుడు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలోని పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగులు సమగ్రతా ప్రతిజ్ఞ చేశారు.
కేంద్ర విజిలెన్స్ కమిషన్ పిలుపు మేరకు "సమగ్రత - ఒక జీవన విధానం" అనే అంశంపై అక్టోబరు 28 నుండి నవంబరు 2వ తేదీ వరకు టిటిడి విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా గురువారం ఉదయం శ్రీవారి ఆలయ వాహన మండపం వద్ద, దివ్యదర్శనం కాంప్లెక్స్ వద్ద శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్న విజిలెన్స్ అధికారులు, నిఘా సిబ్బంది, లడ్డూ కౌంటర్ల సిబ్బంది, త్రిలోక్ సిబ్బంది ఇతర ఉద్యోగులు కలిసి ప్రతిజ్ఞ చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తామని, త్రికరణ శుద్ధితో భక్తులకు సేవ చేస్తామని, టిటిడి ప్రతిష్టకు భంగం కలగకుండా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ విఎస్వో మనోహర్, ప్రభాకర్, ఎవిఎస్వో చిరంజీవి టీటీడీ ఉద్యోగులు ఇతర నిఘా, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.