ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయం మరోసారి నిండుకుండలా తయారైంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,90,452 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా ఆరు గేట్లను ఎత్తి 4,24,530 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. 884.8 అడుగుల మేర నీరుంది. అయితే వరద నీరు భారీగా రావడంతో శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్ల పైనుంచి వరద నీరు ఓవర్ ఫ్లో అయ్యింది.
ఎగువ నుంచి వస్తున్న వరద నేడు కొంత తగ్గే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు.శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 4.13 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది.. దీంతో నాగార్జున సాగర్కు వరద నీటి ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో సాగర్ గేట్లను ఎత్తారు. దీంతో పులిచింతల భారీగా వరదనీరు చేరింది. 40 టీఎంసీల సామర్ధ్యం ఉన్న పులిచింతలలో ప్రస్తుతం 38 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ నుంచి భారీగా ఇన్ ఫ్లో వస్తుండటంతో గేట్లు ఎత్తి నీరును దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు ప్రకాశం బ్యారేజీలోకి 1,79,124 క్యూసెక్కులు వస్తుండగా 50 గేట్లు తెరిచి 93,173 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం నాటికి ప్రకాశం బ్యారేజీలోకి 3.50 లక్షల క్యూసెక్కుల వరద పెరిగే అవకాశం ఉంది. కాగా నెల వ్యవధిలోనే కృష్ణానదికి రెండోసారి భారీగా వరద వచ్చింది.