రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయం
మడికి జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయం కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
ఆలమూరు: మడికి జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయం కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ముక్కామల చెందిన సుమారు 55 నుండి 60 ఏళ్ళ వయసుగల వ్యక్తి హోండా యాక్టివాపై రాజమహేంద్రవరం వైపు వెళ్లుతుండగా అదే దిశలో వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతని తలకు తీవ్రంగా గాయమైంది.
అయితే హెల్మెట్ ధరించి వాహనాన్ని నడుపుతున్నా ప్రమాదం జరిగి హెల్మెట్ నుజ్జునుజ్జు అవటంతో స్థానికులు భయాందోళన గురయ్యారు. కాగా హైవే పోలీస్ పెట్రోలింగ్ వాహనంతో విధుల్లో ఉన్న ఎఎస్సై ఎ గరగారావు, మూర్తులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని హైవే అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా అప్పటికే అది మరో యాక్సిడెంట్లో నిమగ్నమై ఉండటంతో మరలా 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చి క్షతగాత్రున్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఆలమూరు ఎస్సై వి సుభాకర్ పరిస్థితిని సమీక్షించారు.