డాక్టర్ సుధాకర్ వ్యవహారం : వర్ల రామయ్యకు మంత్రి సవాల్
నర్సీపట్నం అనస్తీషియా వైద్యుడు సుధాకర్ బాబు వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.
నర్సీపట్నం అనస్తీషియా వైద్యుడు సుధాకర్ బాబు వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు డాక్టర్ సుధాకర్ కు పిచ్చి ముద్ర వేశారని.. అకారణంగా ఆయనను ఉద్యోగం నుంచి తొలగించాలరని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు సహా టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈవిషయంలో సుధాకర్ పై పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది.
ఇది అటుంచితే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పై టీడీపీ ఆరోపణలు చేసింది. డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో దీనిని మేనేజ్ చేసేందుకు మంత్రి సురేష్ రంగంలోకి దిగినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మార్కాపురంలో మాట్లాడిన మంత్రి తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. డాక్టర్ సుధాకర్తో గాని, వాళ్ల అమ్మ గారితో గాని తాను మాట్లాడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమని టీడీపీ, వర్ల రామయ్యకు సవాల్ విసిరారు, తనపై వర్ల రామయ్య చేసిన ఆరోపణలను నిరూపించాలని అన్నారు. మేనేజ్ అనే పదం టీడీపీకి, ఆ పార్టీ నేతలకే వర్తిస్తుందని చెప్పారు. డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్లను అడ్డుపెట్టుకొని దళితులను రెచ్చగొట్టే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందని.. ఇది మంచి పరిణామం కాదని అన్నారు.