గోదావరి బోటు ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణ
గోదావరి బోటు ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణ జరిపించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది.
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాద ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. విచారణాధికారిగా తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ గురువారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. బోటు ప్రమాదానికి గల కారణాలు, అధికారుల తప్పిదాలు.. అలాగే ప్రమాదం జరిగిన తీరుతెన్నులపై విచారణ జరగనుంది.
60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలావుంటే బుధవారం మరో ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. దేవీపట్నం వద్ద 5, పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి వద్ద ఒక మృతదేహం లభించాయి. బోటులో మొత్తం 73 మంది ప్రయాణించగా.. ప్రమాదంరోజే 26 మంది సురక్షితంగా బయటపడగా.. తొలిరోజు 8, మూడో రోజు 20, నాలుగో రోజు బుధవారం 6 కలిపి ఇప్పటివరకూ 34 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 13 మంది ఆచూకీ లభించాల్సి ఉంది.