అభివృద్ధి ఒకే ప్రాంతంలో ఉంటే ఎలా?

అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సీఎం జగన్మోహ‌న్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Update: 2019-12-17 16:27 GMT
Jayaprakash Narayan File Photo

అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సీఎం జగన్మోహ‌న్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అధికార వికేంద్రీకరణ విధానం మంచిదన్న జగన్‌ మనం కూడా మారాల్సిన అవసరముందన్నారు. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని గుర్తుచేసిన జగన్మోహన్‌రెడ్డి ఏపీలో మూడు కేపిటల్స్‌ పెట్టుకోవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో లేజిస్టేటివ్‌ కేపిటల్‌ విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అలాగే కర్నూలులో హైకోర్టు జ్యుడీషియల్ కేపిటల్ పెట్టుకోవచ్చన్నారు. ఏమో ఏపీకి మూడు కేపిటల్స్ వస్తాయేమోనన్న సీఎం జగన్‌ ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు.

అయితే సీఎం జగన్ వ్యాఖ్యలను తెలుగు దేశం పార్టీ తప్పు పట్టింది. రాజధాని ఏవరైనా మూడు ప్రాంతాల్లో పెడతారా అంటూ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ఏకపక్ష నిర్ణయాలు తప్పుడు విధానాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ విధానాల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని వ్యాఖ్యానించారు. అమరావతిపై ఎన్నో అపోహలు సృష్టించారని విమర్శించారు. సీఎం అమరావతితో ఉంటారా? ఇడుపులపాయలో ఉంటారా? లేక విశాఖలో ఉంటారా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. హైకోర్టు కర్నూలులో పెట్టాలి కోరాం. కమిటీ నివేదిక ఇంకా రాలేదని ఇలాంటి సమయంలో శాసనసభలో రాజధాని గురించి ప్రస్తావించడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు.

అయితే కాంగ్రెస్, బీజేపీ, లోక్‌సత్తా పార్టీలు సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించాయి. కొన్ని మార్పులు చేయాలని కాంగ్రెస్ సూచించింది. శాసన రాజధానిగా విశాఖ చేయాలని, ఎగ్జిక్యూటివ్ రాజధాని అమరావతి చేయాలని కాంగ్రెస్ సూచించింది. కాగా. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ స్పందించారు. జగన్ వ్యాఖ్యలను స్వాగతించాల్పిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రికృతం అయితే భవిష్యత్తులో వివాదాలు రావోచ్చని, అంతా ఒకే ప్రాంతంలో ఉంటే ఎలా అని ప్రశ్నించారు. జగన్ నిర్ణయం సరైందని అన్నారు. అభివృద్ధి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాలని జేపీ అన్నారు. అయితే రాష్ట్రానికి కేంద్ర బిందువుగా అమరావతిని ఉంచాలని సూచించారు. 


Tags:    

Similar News