బోగాపురం ఎయిర్ పోర్టు పనులకు లైన్ క్లియరయ్యింది. దీనిపై ఇటు ప్రభుత్వం, అటు జీఎంఆర్ సంస్థ తరుపున ప్రతినిధులు ఒప్పందం చేసుకుంటూ సంతకాలు చేసుకున్నారు. అయితే వీటిని వీలైనంత తొందర్లో నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకుంటామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వంతో జీఎంఆర్ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వం తరఫున అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాలవలవన్, జీఎంఆర్ ఛైర్మన్ జీబీఎస్ రాజు సంతకాలు చేశారు.
సీఎం ఆశించిన విధంగా చిరస్మరణీయ రీతిలో ఈ ఎయిర్పోర్టును నిర్మిస్తామని జీఎంఆర్ ప్రతినిధులు ఎంఓయు కుదిరిన సందర్భంగా వెల్లడించారు. దీనికోసం ప్రముఖ అంతర్జాతీయ సంస్థల సేవలను వినియోగించుకుంటున్నామని జీఎంఆర్ ప్రతినిధులు తెలిపారు. తాము పుట్టిన ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
భోగాపురం ఎయిర్పోర్టు ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి సదుపాయం వస్తుందని సీఎం జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎయిర్ పోర్టునుంచి విశాఖ నగరానికి వీలైనంత వేగంగా, సులభంగా, సౌకర్యంగా చేరుకునేలా రహదారులను నిర్మిస్తామని సీఎం చెప్పారు. వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్టుకు విశాఖనగరంతో అనుసంధానం చేసేలా మెట్రో ఏర్పాటుపైనా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.