కర్నాటకలోని ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో తుంగభద్రకు వరద ప్రభావం తగ్గింది. ఇటు దిగువ కృష్ణా నదికి వరద స్థిరంగా కొనసాగుతోంది. దీంతో తెలంగాణలో ఉన్న జూరాలకు ఇన్ఫ్లో 81వేల క్యూసెక్కులుగా నమోదవుతోంది.. ప్రస్తుతం ఐదు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేశుల నుంచి లక్ష క్యూసెక్కులకుపైగా వరదనీరు వస్తోంది.. దీంతో శ్రీశైలంలో ఒక గేటును ఎత్తి దిగువన ఉన్న సాగర్ కు వదులుతున్నారు. ఇటు నాగార్జున సాగర్ కు కూడా వరద నీరు భారీగా చేరింది. దీంతో ఆరు క్రస్ట్గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. అలాగే పులిచింతల ప్రాజెక్టుకు లక్షా 32వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది.. ఈ నీరంతా ప్రకాశం బ్యారేజ్లోకి వదిలిపెడుతున్నారు అధికారులు. ప్రకాశం బ్యారేజీ దగ్గర లక్షా 40వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా.. అదే మొత్తాన్ని సముద్రంలోకి వదులుతున్నారు.