అతిలోక సుందరి శ్రీదేవికి తిరుమల అంటే చాలా ఇష్టమని అందరికి తెలుసు. ప్రతి ఏటా తన పుట్టినరోజు సందర్బంగా తిరుమల వచ్చి వెళుతుండేవారు. అయితే శ్రీదేవి దూరమయ్యాక ఆమె ఇష్టాలను కూతుళ్లు గౌరవిస్తున్నారు. ఇటీవల శ్రీదేవి పుట్టినరోజు సందర్బంగా కుటుంబం మొత్తం తిరుమలకు వచ్చింది. ఆ సమయంలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అమ్మలాగే తనకూ కూడా తిరుమల అంటే చాలా ఇష్టమని.. ఇకనుంచి ప్రతి ఏడాది తిరుమలకు వస్తానని చెప్పింది. తాజాగా తన పెళ్లి తిరుపతిలో ఉంటుందని చెప్పింది జాన్వీ..
ఈ మేరకు బ్రైడ్స్ టుడేకిచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడుతూ.. 'అట్టహసంగాజరిగే పెళ్లి వేడుకలకు నేను దూరం. అందుకే నా వివాహం సాంప్రదాయబద్ధంగా తిరుపతిలో జరుగుతుంది. పెళ్లిలో నేను కంజీవరం జరీ చీర ధరిస్తాను. వివాహం తర్వాత నాకు ఇష్టమైన దక్షిణ భారతదేశ వంటకాలతో బ్రహ్మండమైన దావత్ ఉంటుంది. దానిలో ఇడ్లీ, సాంబార్, పెరుగన్నం, పాయసం వంటివి ఉంటాయి' అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. కాగా శ్రీదేవికి తిరుపతిలో బంధువులున్న సంగతి తెలిసిందే.