ఉత్తర కోస్తా తీరానికి దగ్గరలో, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇటు రాయలసీమలో కురుస్తున్న వర్షాలకు కర్నూలు, కడప జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. గత ఐదుగురోజులుగా కురిసిన వర్షాలతో నంద్యాల డివిజన్లోని 17 మండలాలు జలమయం అయ్యాయి. వరదనీరు కుందూనదిలో కలవడంతో ప్రవాహం ఉప్పొంగి జనావాసాలను ముంచెత్తింది. మద్దిలేరు వాగును వరదనీరు ముంచెత్తడంతో సమీపంలోని ఇళ్లు నీట మునిగాయి.