ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ భారీ వర్షాలకు కర్నూలు జిల్లా నంద్యాల రెవెన్యూ డివిజన్ అతలాకుతలమైంది. వాగులు, వంకలు, పిల్లకాల్వలు కాల్వలు పొంగి పొర్లాయి. పలుచోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. భారీ వర్షం కారణంగా పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలంలోని యూళ్లూరు, జిల్లెల్ల, నెహ్రూనగర్ పసురపాడు, చింతకుంట, గోస్పాడు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇటు ఆళ్లగడ్డ మండలంలోని పడకండ్ల, నల్లగట్ల, బత్తులూరు, నందింపల్లి, బృందావనం, గూబగుండం, జి.కంబలదిన్నె గ్రామాలు జలమయం అయ్యాయి. అలాగే మండలంలోని వక్కిలేరు, నల్లవాగు పొంగిపొర్లాయి. ఇళ్లలోకి నీరు వెళ్లడంతో ఆహార ధాన్యాలు తడిసిపోయాయి. చాగలమర్రి మండలంలో బ్రాహ్మణపల్లి, కొలుగొట్లపల్లి, రాంపల్లి, అవులపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్ష కారణంగా ప్రముఖ శైవక్షేత్రం మహానంది ప్రాంతం ముంపునకు గురైంది. మహానంది మండలం తిమ్మాపురం, అబ్బీపురం, గోపవరం, గాజులపల్లి గ్రామాల్లోకి భారీగా వర్షపునీరు చేరింది.