నూతన ఇసుక పాలసీ సక్సెస్ అవుతోందా!
నూతన ఇసుక పాలసీ సక్సెస్ అవుతోందా! నూతన ఇసుక పాలసీ సక్సెస్ అవుతోందా!
విచ్చలవిడిగా ఇసుక దోపిడీ కారణంగా గతంలో ఆంధ్రప్రదేశ్ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొందరు ప్రజాప్రతినిధులే నేరుగా ఇసుక మాఫియా అవతారం ఎత్తడంతో ప్రభుత్వ యంత్రాంగం వారిని నిలువరించలేకపోయింది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిద్వారా నేరుగా ప్రభుత్వమే ఇసుకను అమ్ముతోంది. అక్రమాలు జగకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ ఇసుక రీచులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 102 ఇసుక రీచులు అందుబాటులో ఉండగా. 57 ఇసుక స్టాక్ పాయింట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వరదల సీజన్ కారణంగా తడిసిన ఇసుకను రీచులలోనుంచి బోట్ల ద్వారా తీసుకువచ్చి ముందుగానే ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్లకు తరలిస్తున్నారు. మీసేవా ద్వారా, లేదా వెబ్సైట్ ద్వారానో ఇసుక బుక్ చేసుకుంటున్న కస్టమర్లు ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకు ఇసుకను కొనుగోలు చేస్తున్నారు.
ఇటు ప్రభుత్వం రిజిస్టర్ చేసిన వాహనాల ద్వారా ఇసుకను పంపిస్తూ.. ఇసుక తవ్వకాలు, రవాణాలో ఎటువంటి అక్రమాలూ జరగకుండా అన్ని రీచ్లు, స్టాక్ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇసుక తరలించే వాహనాలను జిపిఎస్ తో ట్రాకింగ్ చేస్తున్నారు. దీంతో గతంలోకంటే ప్రస్తుతం ఇసుక దోపిడీ తగ్గిందనే చెప్పాలి. అయితే ఎంత చేసినా కూడా అక్కడక్కడా ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వం కళ్లుగప్పి అక్రమంగా ఇసుకను తరలిస్తోంది. ఈ తరలించిన ఇసుకను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా అధిక మొత్తంలో అమ్ముతున్నారు. దీనిపై సీరియస్ గా దృష్టిసారించిన ఏపీ ప్రభుత్వం.. ప్రస్తుతం మాఫియాను గుర్తించే పనిలో పడింది. ఒకవేళ ఈ మాఫియా వెనుక ప్రజాప్రతినిధులు ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది.