డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించిన డాక్టర్లు
ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సి.ఎచ్.ఓ మోహన్ బాబు,హెల్త్ సూపర్ వైజర్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.
కూడేరు: ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సి.ఎచ్.ఓ మోహన్ బాబు,హెల్త్ సూపర్ వైజర్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. డెంగ్యూ వ్యాధి నివారణలో భాగంగా అరవకూరు గ్రామంలో డెంగ్యూ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి, నివారణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, నిల్వ ఉన్న మంచి నీటిలోనే డెంగ్యూ దోమ వృద్ధి చెందుతుందని, పగటి పూట కుట్టే ఈ పులిదోమ కుట్టిన వారం లోపల వ్యాధి లక్షణాలు బయట పడతాయని దీంతో జ్వరం, వాంతులు, నీరసంగా ఉండటం, విపరీతమైన కాళ్ళు, కీళ్లు నొప్పులు ఉంటాయన్నారు.
అందువల్ల నీరు నిల్వ ఉంచకుండా వారానికి ఒకసారి డ్రై డే పాటించాలని, నీటి నిల్వలపై వేస్ట్ ఆయిల్ వేసుకోవాలని తెలియజేశారు. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని, అప్పుడే దోమలు వాటినుండి వచ్చే జ్వరాల నుండి కాపాడుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్స్ చంద్రప్ప, హనుమక్క, ఆశా కార్యకర్తలు చంద్రకళ, ఆదిలక్ష్మి రోజా, సచివాలయ వాలంటీర్లు పాల్గొన్నారు.