కరోనా కట్టడికి సీఎం జగన్ కీలక ఆదేశాలు
రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు
రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్య, నర్సింగ్ సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. అంతేకాదు 8 జిల్లాల్లోని కోవిడ్ ఆస్పత్రుల్లో ప్రస్తుతమున్న ఐసోలేషన్ పడకలు, ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను పెంచాలని అధికారులు చెప్పారు. వైరస్ సోకడం తప్పేమీ కాదన్న ముఖ్యమంత్రి కరోనా సోకడం నేరం అంతకన్నా కాదని సమీక్ష సందర్బంగా అభిప్రాయపడ్డారు. అలాగే కోవిడ్ పట్ల ప్రజల్లో ఉన్న భయాలను తొలగించేందుకు కృషి చెయ్యాలని అధికారులకు చెప్పారు. ఈ మేరకు ప్రతి గ్రామాల్లో ప్రజలకు అవగాహాన కల్పించాలన్నారు.
ఈ మహమ్మారి ఎవరికైనా సంభవించవచ్చని.. అందువల్ల కరోనా పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకురావాలిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కనీసం పాటించాల్సిన జాగ్రత్తలు, వైద్య సహాయంతో వైరస్ బాధితులు కోలుకోవడం సులభమని పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్లనాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని.. ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్రెడ్డి, అలాగే ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.