ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవంబర్ నెలలో తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ పరిహారాన్ని బాధిత మత్స్యకారులకు అందజేయనున్నారు. దీనిపై ఇప్పటికే క్యాబినెట్లో చర్చించి ఆమోదించిన సంగతి తెలిసిందే. ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల్లోని సుమారు 17,550 మంది మత్స్యకారులకు ఏడు నెలల కాలానికి పరిహారం రూ.80 కోట్లు విడుదల చేయనున్నారు. సీఎం చేతులు మీదుగా ఈ పరిహారం పంపిణీ చేయనున్నారు.
ఈ మేరకు వచ్చే నెల 21న సీఎం ముమ్మిడివరం వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలాగే రూ.35 కోట్లతో పూర్తి చేసిన పశువుల్లంక–సలాదివారిపాలెం వంతెనను కూడా సీఎం ప్రారంభించనున్నారు. దీంతో కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్ శుక్రవారం నిర్మాణం పూర్తయిన వంతెనను, పరిహారం పంపిణీ కోసం ఏర్పాటు చేసే స్థలాలను పరిశీలించారు.