Revanth Reddy: రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

Revanth Reddy: ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి సీఎం కృషి

Update: 2024-03-10 15:15 GMT

Revanth Reddy: రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన 

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రేపు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ‍యన సీఎం హోదాలో పుణ్యక్షేత్రాలను దర్శించుకోనున్నారు సీఎం. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని సీఎం రేవంత్ దర్శించుకుంటారు.

అనంతరం ప్రత్యేక పూజలు చేసి అక్కడ నుంచి నేరుంగా ఖమ్మం వెళ్తారు. అక్కడికి చేరుకున్న తర్వాత భద్రాచలం రాములోరిని దర్శించుకోనున్నారు రేవంత్. సీఎం పర్యటన కోసం జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల ఇతర మంత్రులు ప్రత్యేక హెలికాప్టర్లలో అక్కడికి చేరుకోనున్నారు.

భద్రాద్రి చేరుకున్న తర్వాత మొదట రామయ్యను దర్శించుకుంటారు సీఎం రేవంత్. సీఎం టూర్ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దారు ఆలయ అధికారులు. రామాలయం అభివృద్దిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉండటంతో, ఆలయ అభివృద్దికి చేపట్టాల్సిన పనులపై దేవస్ధానం పరిపాలన అధికారులతో ఆలయ ఈవో పలు దఫాలుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. దేవస్ధానం అభివృద్దిపై సీఎం రేవంత్‌కు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు అధికారులు.

ఇక ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారేంటీల్లో ఐదో గ్యారంటీ అయిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భద్రాద్రి రామయ్య క్షేత్రం నుంచి శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. అయితే ముందుగా ఈ కార్యక్రమాన్ని మిథిలా స్టేడియంలో నిర్వహించాలని భావించినా సాంకేతిక కారణాలతో భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు వేదికను మార్చారు.

ఇక భద్రాచలం పర్యటనలో భోజన విరామం అనంతరం పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో నిర్వహించే సభకు సీఎం రేవంత్‌ హాజరవుతారు. రేపు మధ్యాహ్నం మూడు తర్వాత జరిగే ఈ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎంతో పాటు పలువురు మంత్రులు ఈ సభకు హాజరుకానున్నారు.

Tags:    

Similar News