Jagan: నేడు కుప్పం నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటన
Jagan: హంద్రీనీవా ద్వారా కుప్పంకు నీరు విడుదల చేయనున్న సీఎం
Jagan: నేడు కుప్పం నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటన
Jagan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఓ వైపు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, మరో వైపు సిద్ధం పేరుతో బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన నేడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న హంద్రీనీవా జలాలను ఈ పట్టణానికి ఆయన విడుదల చేయనున్నారు. కుప్పం వాసుల కలను సీఎం జగన్ సాకారం చేయబోతున్నారంటూ వైసీపీ శ్రేణులు తెలుపుతున్నారు.
తాగు, సాగునీటి కోసం దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ... కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాటను సీఎం జగన్ నిలబెట్టుకుంటున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నారు. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6 వేల 300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు.. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల జనాభాకు త్రాగు నీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను 560.29 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేశారు. కుప్పం నియోజకవర్గానికి నేడు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు సీఎం జగన్. అనంతరం శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లె వద్ద బహిరంగ సభలో పాల్గొననున్నారు.
చిత్తూరు జిల్లా పెద్దపంజాణీ మండలం అప్పినపల్లె చెరువు వద్ద నిర్మించిన కుప్పం బ్రాంచ్ కెనాల్ సీఎం జగన్ ప్రారంభిస్తారు. దీని నీటి సామర్థ్యం 216 క్యూసెక్కులు. కాలువ పొడవు 123.641 కిలోమీటర్లు కాగా.. ఇందులో మూడు లిఫ్టులను నిర్మించారు. ఈ కాలువ ద్వారా 110 చెరువులను నింపనున్నారు. తద్వారా 6 వేల 300 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. మరోవైపు పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు చెందిన 4 లక్షల 2 వేల మంది ప్రజలకు తాగునీరందించనున్నారు. మరోవైపు కుప్పంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు సీఎం జగన్.