ఆవ భూముల్లోనే రూ.500 కోట్ల అవినీతి జరిగింది : చంద్రబాబు

Update: 2020-08-20 06:51 GMT

Chandrababu writes to AP chief secretary: ఇళ్ల పట్టాల పేరుతో భూసేకరణలో అవినీతి జరుగుతోందంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఇళ్లపట్టాల పేరుతో భూసేకరణలో అవినీతిపై ఫిర్యాదు చేశారు. ఇళ్ల పట్టాల పేరుతో పేదల భూములు లాక్కోవడం బాధాకరమన్నారు. ఇళ్ల నిర్మాణానికి అనువుగాని భూముల సేకరణ ఇంకో దుశ్చర్య అని చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తడి నేలలు, ముంపు భూములు, మడ అడవులను ప్రభుత్వమే కొనడం దుర్భరమన్నారు.

రాజానగరం(తూగో) కోరుకొండ మండలం బూరుగుపూడి భూసేకరణ ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. 600ఎకరాల ఆవ భూములు ఇళ్లపట్టాల కింద సేకరించారన్నారు. ఎకరం రూ45లక్షల చొప్పున రూ 270కోట్లు ఖర్చుచేశారని వెల్లడించారు. ఆవ భూముల్లోనే మొత్తం రూ 500కోట్ల అవినీతి కుంభకోణం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. ఇళ్లపట్టాల భూసేకరణలో సరికొత్త అవినీతికి అంకురార్పణ జరిగిందన్నారు. అధికార వైసీపీ నాయకులు స్థానిక అధికారులతో కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.

భూసేకరణలో తొలిదశ అవినీతి.. మెరక, లే అవుట్, రోలింగ్‌లో రెండో దశ అవినీతి జరిగిందన్నారు. ఇళ్ల పట్టాలకు భూసేకరణపై సమగ్ర విచారణకు ఆదేశించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అప్పుడే అవినీతి దృష్టాంతాలు అనేకం బయట పడతాయన్నారు. సమగ్ర విచారణ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. లేఖతోపాటు వరదల్లో నీట మునిగిన ఆవభూములపై పేపర్ క్లిప్పింగ్‌లు కూడా పంపారు.


Tags:    

Similar News