తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆదివారం రాజమండ్రిలో జరిగిన ఈ సమీక్షకు విపత్తు నివారణ కమిటీ హాజరైంది. బోటు ప్రమాద వివరాలు, జరుగుతున్న సహాయక చర్యలపై అధికారులు కిషన్ రెడ్డికి వివరించారు. ఈ సందర్బంగా ప్రమాదానికి గురైన బోటును గుర్తించేందుకు నేవీ అధికారులను సంప్రదించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి. తుఫాన్లు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయని, ముందుగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రైవేట్, ప్రభుత్వ బోట్లయినా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, కలెక్టర్, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.