కాశీ విశ్వనాధ ట్రస్టు అధికార ప్రతినిధిగా యామిని శర్మ.. ఉత్తర్వులు జారీచేసిన ఆలయ ఈవో

Update: 2020-06-10 14:41 GMT
Sadineni Yamini Sarma (File Photo)

ఈ మద్యకాలంలో బీజేపీలో చేరిన సాధినేని యామిని శర్మను పార్టీ గుర్తించింది. ఆమె చేసిన సేవలకు గాను కాశీ విశ్వనాధ ట్రస్టు దక్షిణాది అధికార ప్రతినిధిగా నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఈవో అధికారికంగా పంపించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ మ‌హిళా నాయ‌కురాలు సాధినేని యామినికి కీలక పదవి దక్కింది. వారణాసి లోని కాశీ విశ్వనాథ ట్రస్ట్ దక్షిణాది స్పోక్ ప‌ర్స‌న్(అధికార ప్రతినిధి)గా ఆమె నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను ఆలయ పాలక మండలి సీఈవో విశాల్ సింగ్ విడుద‌ల చేశారు. ఈ విషయాన్ని యామిని సామాజిక మాధ్య‌మాల ద్వారా అంద‌రితో పంచుకున్నారు.

కాశీ విశ్వనాథ ఆల‌యం చేస్తున్న కార్యక్రమాలను, అందిస్తున్న సేవలను ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు, తమిళనాడు, కర్నాటకలోని ప్ర‌జ‌ల‌కు తెలిసేలా చేయాల్సిందిగా యామినీ శర్మను ఆలయ సీఈవో తమ ఆదేశాల్లో కోరారు. రెమ్యూన‌రేష‌న్ లేకుండా.. ఆలయం తరపున ఎటువంటి డొనేష‌న్స్ తీసుకోకుండా, స్వచ్ఛందంగా యామినీ శర్మ ఈ సేవలు చేస్తారని కాశీ విశ్వనాథ దేవాలయం తెలిపింది. కాశీ యాత్రకు వచ్చే భక్తులకు అవ‌స‌ర‌మైన‌ సమాచారాన్ని దక్షిణాదిలో మీడియా, సోషల్ మీడియా ద్వారా యామినీ శర్మ తెలియజేయాలని ఆలయ సీఈవో విశాల్ సింగ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ద్వాదశ జ్యోతిర్లంగాలలో ఒకటైన కాశీ విశ్వనాథునికి సేవ చేయ‌డంతో పాటు, దక్షిణాది ప్రజల్లోకి ఆల‌య ప్రచారాన్నీ తీసుకెళ్లే బాధ్యతలు తనకు అప్పగించినందుకు దేవ‌స్థానం సీఈవోకు యామిని ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిపై జరుగుతున్న..తప్పుడు ప్ర‌చారాల‌ను వెలుగులోకి తెస్తూ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తానని ఆమె వివ‌రించారు.


Tags:    

Similar News