ఏపీలో రేపటి నుంచే ఆర్టీసీ సర్వీసులు
ఏపీలో ఆర్టీసీ బస్ సర్వీసులు పునరుద్ధరించేందుకు రంగం సిద్ధమైంది.
ఏపీలో ఆర్టీసీ బస్ సర్వీసులు పునరుద్ధరించేందుకు రంగం సిద్ధమైంది. సీఎం ఆదేశించడంతో గురువారం నుంచి అధికారులు ప్రణాళిక బస్సులు నడిపేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో వివిధ నగరాలు, పట్టణాల మధ్య ఓ బస్టాండ్ నుంచి మరో బస్టాండ్ వరకే బస్సులు నడిపేలా అధికారులూ ఏర్పాట్లు చేశారు. కరోనా నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదానిపై అధికారులు చర్చించారు. బస్టాండ్లలో మాత్రమే బస్సులు ఆపుతారు. బస్టాండ్లో ప్రయాణికులు టికెట్ కోనుగోలు ముందు థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. ప్రయాణికుల వివరాలు, ఫోన్ నంబర్లు, ఎక్కడకు వెళ్ళేది వివరాల నమోదు చేసుకుంటారు.
కరోనా వైరస్ నేపథ్యంలో బస్సుల్లో సగం సీట్లలో మాత్రమే ప్రయాణికులను అనుమతించాల్సి ఉండటంతో.. సంస్థకు భారీగానే నష్టం వస్తూంది. ఈ నేపథ్యంలో ఛార్జీల పెంపుపై కసరత్తు చేశారు. తాత్కాలికంగా 50 శాతం వరకు ఛార్జీలు పెంచేందుకు వీలుగా ప్రతిపాదనలు తయారు చేశారు. బస్సు సర్వీసుల పునరుద్ధరణపై ఆర్టీసీ ఎండీ మంగళవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ సర్కార్ ఆర్టీసీ సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.