టీడీపీ అభ్యర్థుల ఎన్నికను సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు వేర్వేరుగా ఎన్నికల పిటీషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.. ఈ పిటిషన్లపై హైకోర్టు స్పందించి.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడుకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
గుంటూరు నుంచి గల్లా జయదేవ్ ఎన్నికను సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్రెడ్డి హైకోర్టులో ఎన్నికల పిటీషన్ దాఖలు చేశారు. ఓట్లను సరిగ్గా లెక్కించకపోవడంతో తాను కేవలం 4,200 ఓట్ల తేడాతో ఓడిపోయానని పిటీషన్లో పేర్కొన్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఎన్నికను సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థి బొప్పన భవకుమార్ తరఫున ఆయన ఎన్నికల ఏజెంట్ వి.శ్రీనివాసరెడ్డి ఎన్నికల పిటీషన్ దాఖలు చేయగా రామానాయుడు ఎన్నికను సవాల్ చేస్తూ పాలకొల్లు వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సీహెచ్.సత్యనారాయణమూర్తి కూడా ఎన్నికల పిటీషన్ దాఖలు చేశారు. వీరిద్దరూ తమ ఎన్నికల అఫిడవిట్లలో ఆదాయ వివరాల్లో తేడాలు ఉన్నాయని పిటిషన్ దాఖలు చేశారు.