AP Assembly Session 2026 : ఏపీ అసెంబ్లీలో నేడు కీలక బిల్లులు... సభలో చర్చకు రానున్న కీలక అంశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగింపు దశకు చేరాయి. నేడు మోటార్ వాహన చట్టం, జేఎన్టీయూ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మాదక ద్రవ్యాలు, హాస్టల్ భద్రతపై సభలో కీలక చర్చ జరగనుంది.
AP Assembly Session 2026
AP Assembly Session 2026 : ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. నేడు (గురువారం, మార్చి 5) ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమైంది. నేటి అజెండాలో ప్రజా సమస్యలతో పాటు కీలక బిల్లులు కూడా ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం నిర్దేశించుకున్న అసెంబ్లీ బిజినెస్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ నేపథ్యంలో సభను షెడ్యూల్ ప్రకారం రేపటితో ముగిస్తారా లేక శనివారం (మార్చి 7) వరకు పొడిగిస్తారా అనే అంశంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
నేటి సభలో ప్రధానంగా ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పలు కీలక అంశాలను లేవనెత్తనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచా స్వాధీనం, దాని భద్రతపై సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. అలాగే, రాష్ట్రంలోని బాలికల హాస్టళ్లలో భద్రత కట్టుదిట్టం చేయడం, యువతలో పెరిగిపోతున్న మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హాట్ హాట్ చర్చ జరగనుంది. వీటికి తోడు, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డ్రైనేజీ సమస్యలు, తోటపల్లి ఎడమ కాలువ ఆధునికీకరణ, కుందు నదిపై ఎత్తిపోతల పథకం ఏర్పాటుపై సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు.
శాసన వ్యవహారాల్లో భాగంగా ప్రభుత్వం నేడు రెండు కీలక సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. రహదారి భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లు, అలాగే విద్యాశాఖలో సంస్కరణల కోసం జేఎన్టీయూ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వీటితో పాటు వివిధ శాఖల గ్రాంట్లు, డిమాండ్లపై చర్చ కొనసాగనుంది. మార్చి 6వ తేదీతో సమావేశాలు ముగుస్తాయని ముందుగా అనుకున్నప్పటికీ, శనివారం రిజర్వ్ డేగా ఉంది. ఒకవేళ బిజినెస్ ఇంకా మిగిలి ఉంటే ఆ రోజు కూడా సభ నిర్వహించే అవకాశం ఉంది.