Amaravathi: ఎస్పీసెంథిల్కు సీఎం జగన్ అభినందనలు
మార్చి1నాటికి అన్ని దిశ పోలీస్ స్టేషన్ లు సిద్ధం కావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
అమరావతి: మార్చి1నాటికి అన్ని దిశ పోలీస్ స్టేషన్ లు సిద్ధం కావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ సచివాలయంలో మహిళా పోలీసు, మహిళా మిత్రలను పెట్టామని తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి,విశాఖ జిల్లాల్లో బెల్టుషాపులు నడుస్తున్నట్టు సమాచారం వస్తోందని సీఎం అధికారులకు తెలిపారు. వివరాలు తెప్పించుకుని కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
సంబంధిత జిల్లాల ఎస్పీలు గట్టి సంకేతాలు పంపించాల్సిన అవసరం ఉందన్నారు. బెల్టు షాపులు నిర్వహించే వారికి, అక్రమ మద్యం తయారీ చేసే వారికి భయం రావాలని సీఎం జగన్ అన్నారు. చిత్తూరు జిల్లాలో బాలిక అత్యాచారం, హత్య ఘటన విషయంలో వెంటనే తీర్పు వచ్చిన విషయాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ సీఎం జగన్కు వివరించారు.
పోలీసులు శరవేగంగా పనిచేసి ఛార్జిషీటు వేశారని,గట్టి ఆధారాలను కోర్టు ముందు ఉంచారని డీజీపీ తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ను ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్కు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.