చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో షాక్..
టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ దాఖలైన ప్రజా ప్రయోజనా వాజ్యంపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.
టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ దాఖలైన ప్రజా ప్రయోజనా వాజ్యంపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.చంద్రబాబు లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘించారని దీనిపై కేసు నమోదు చేయాలంటూ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపి న్యాయస్థానం చంద్రబాబు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించటంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారా? లేదా? అని పిటిషనర్ను న్యాయస్థానం ప్రశ్నించింది.
గతంలో ఇలాంటి కేసులను నేరుగా హైకోర్టు నేరుగా విచారణకు స్వీకరించిందని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాగా, రెండు నెలల తర్వాత సోమవారం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. ఆ సమయంలో చంద్రబాబు వస్తున్నారని తెలిసిన తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు చేరుకున్నారు. మాస్క్లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా చంద్రబాబుకు స్వాగతం పలకటానికి ఎగబడ్డారు.
చంద్రబాబు ఏపీకి చేరుకోగానే జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్లలో మాజీ ఎమ్మెల్యేలు శ్రీరామ్ తాతయ్య, తంగిరాల సౌమ్యలు పార్టీ జెండాలతో స్వాగతం పలికేందుకు వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు కారు బయటకు వచ్చి చేతులు ఊపుతూ టీడీపీ శ్రేణులకు అభివాదం తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఐదుగురికి హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు చంద్రబాబు కేసును కూడా గురువారం విచారిస్తామని హైకోర్టు తెలిపింది.