ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్నిని మరో ఆరు నెలలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్టే ఆమె పదవీకాలాన్ని మరో ఆరునెలలు పొడిగించాలని ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ మేరకు సీఎం ఇటీవల ప్రధానికి లేఖ రాసినట్లు అధికార వర్గాలు దృవీకరిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా కొనసాగుతోన్న నీలం సాహ్ని జూన్ 30న పదవీ విరమణ చేయనున్నారు.
కరోనా నేపథ్యంలో సీఎస్ విధులు కీలకమైనందున ఆమె పదవీ కాలం పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలావుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో(ఎస్ఈబీ–లిక్కర్ అండ్ శాండ్)కు పదకొండు మంది ఏఎస్పీ లు బదిలీ అయ్యారు. వీరిని బదిలీ చేస్తూ.. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.