అధికార పార్టీలో ముసలం పుట్టింది. వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి చిత్తూరు జిల్లా పర్యటన, ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది. తనను పిలవకుండా తన నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారంటూ.. నారాయణస్వామిపై రోజా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రోజా వ్యాఖ్యలకు నారాయణ స్వామి కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు.
పుత్తూరులో పర్యటించేందుకు తనకు రోజా అనుమతి అవసరం లేదని నారాయణస్వామి చెప్పారు. ఆమెకు వ్యతిరేకంగా తాము మీటింగ్ పెట్టుకోలేదని చెప్పారు. 40 ఏళ్ల క్రితం గిరిజన యువజన సంఘాన్ని ఏర్పాటు చేశారని... సంఘం తరపున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. అక్కడ ఒక కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేయాలనుకున్నామని, జిల్లా కలెక్టర్ తిరుపతికి వెళ్తూ పుత్తూరుకు వచ్చి స్థలాన్ని పరిశీలించారని నారాయణ స్వామి చెప్పారు.