IND vs AFG Test: 9 వికెట్లు పడగానే ముగిసిన మ్యాచ్.. అయోమయంలో అభిమానులు.. అసలు కారణం ఇదే!

What happened to Sharafuddin Ashraf. ముల్లాన్‌పూర్ టెస్ట్ మ్యాచ్‌లో అఫ్గాన్ రెండో ఇన్నింగ్స్ ముగిసే సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

Update: 2026-06-08 13:32 GMT

IND vs AFG Test: ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. మూడు రోజుల వ్యవధిలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. గిల్, రాహుల్ శతకాలు చేయగా.. మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ వికెట్ల వేట కొనసాగించారు. అయితే ఈ టెస్ట్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ రెండో ఇన్నింగ్స్ ముగిసే సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కేవలం 9 వికెట్లు మాత్రమే పడినా.. అంపైర్లు మ్యాచ్ ముగిసినట్లు ప్రకటించడంతో కొంతసేపు అభిమానుల్లో అయోమయం నెలకొంది.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌటైంది. అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత బౌలింగ్‌తో 6 వికెట్లు పడగొట్టి.. అఫ్గాన్ బ్యాటింగ్‌ను కుదేలు చేశాడు. ఫాలోఆన్ ఆడిన అఫ్గానిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా భారత స్పిన్నర్ల ధాటికి 112 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో 9వ వికెట్ పడిన వెంటనే ఆట ముగియడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా ఒక జట్టు 10 వికెట్లు కోల్పోయిన తర్వాతే ఇన్నింగ్స్ ముగుస్తుంది. కానీ అఫ్గానిస్థాన్ బ్యాటర్ షరాఫుద్దీన్ అష్రఫ్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాలేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ పూర్తయినట్లు ప్రకటించారు.

మొదటి ఇన్నింగ్స్ సందర్భంగా షరాఫుద్దీన్ అష్రఫ్ కాలికి గాయం అయింది. ఆ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడానికి అతడు మైదానంలోకి రాలేదు. దీంతో అతడిని 'అబ్సెంట్ హర్ట్'గా ప్రకటించారు. ఫలితంగా 9 వికెట్లు పడిన వెంటనే అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్ ముగిసినట్లుగా అంపైర్లు పరిగణించారు. అందుకే చివరి వికెట్ పడకముందే మ్యాచ్ అధికారికంగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో మానవ్ సుతార్ భారత విజయానికి ప్రధాన కారణం. తొలి ఇన్నింగ్స్‌లో 6/33 గణాంకాలతో చెలరేగిన అతడు.. మ్యాచ్ మొత్తం 7 వికెట్లు సాధించి అరంగేట్ర టెస్టులోనే తన ముద్ర వేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి అఫ్గాన్ బ్యాటింగ్‌ను కుదేలు చేశారు.

ఈ విజయంతో భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. ఇంతకుముందు 2018లో వెస్టిండీస్‌పై సాధించిన ఇన్నింగ్స్ 272 పరుగుల విజయాన్ని అధిగమిస్తూ.. అఫ్గానిస్థాన్‌పై ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో గెలిచి కొత్త రికార్డు సృష్టించింది. యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన, ముఖ్యంగా మానవ్ సుతార్ అరంగేట్ర విజయం భారత టెస్ట్ జట్టు భవిష్యత్తుపై మరింత ఆశలు పెంచింది.

Tags:    

Similar News