Markapuram: ప్రజా సమస్యల వేదికపై కలెక్టర్ విజయ సునీత కీలక ఆదేశాలు
Markapuram: ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారంపై ప్రజలు తమ స్పందనను క్యూఆర్ కోడ్ ద్వారా తెలియజేయాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత కోరారు.
Markapuram: ప్రజా సమస్యల వేదికపై కలెక్టర్ విజయ సునీత కీలక ఆదేశాలు
Markapuram: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)పై ప్రజలు తమ స్పందన తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికను మరింత పారదర్శకత, జవాబుదారీతనం దిశగాను, నిరంతర అభిప్రాయ సేకరణ చేసి పౌరుల సంతృప్తిని మెరుగుపరచడం, వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
పి.జి.ఆర్.ఎస్ కేంద్రాలను సందర్శించే పౌరుల నుండి అభిప్రాయాన్ని సేకరించేందుకు జిల్లా, మండల స్థాయి పి.జి.ఆర్.ఎస్ కేంద్రాలలో, వివిధ మాధ్యమాల్లో ప్రజల అభిప్రాయ సేకరణకు క్యూ.ఆర్ కోడ్ను ప్రదర్శించాలని నిర్ణయించడం జరిగిందని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా, మండల స్థాయి పి.జి.ఆర్.ఎస్ కేంద్రాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలలో క్యూ.ఆర్ కోడ్ ప్రముఖంగా ప్రదర్శించాలని ఆదేశించారు.
క్యూ.ఆర్ కోడ్ను స్పష్టంగా, కంటికి కనిపించే పరిమాణంలో ముద్రించి, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పౌరులు పి.జి.ఆర్.ఎస్ సేవలను పొందిన వెంటనే తమ మొబైల్ ఫోన్ల ద్వారా క్యూ.ఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ అభిప్రాయాన్ని సమర్పించవచ్చని చెప్పారు. ఎక్కువ సంఖ్యలో పౌరులు భాగస్వామ్యం అయ్యే విధంగా నోటీసు బోర్డులు, హెల్ప్ డెస్క్లు, ఫిర్యాదుల కౌంటర్లు, తదితర ప్రదేశాల్లో పెట్టాలని సూచించారు.
క్యూ.ఆర్ కోడ్ వలన ప్రజల స్పందన అధికారిక పి.జి.ఆర్.ఎస్ పోర్టల్ https://pgrs.ap.gov.in/Home/QRGrievance Feedback కు చేరుతుందని అన్నారు.
ఆర్జీల స్థితిగతులు తెలుసుకొనుటకు టోల్ ఫ్రీ నంబర్ 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. పి.జి.ఆర్.ఎస్ ను వినియోగించుకోవాలని, తమ అభిప్రాయాలను తెలియజేస్తూ మరింత మెరుగైన సేవలు అందించుటకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోను, మండల కార్యాలయాల్లోనూ నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ లో అర్జీలు అందించండి, వాటిపై మీ స్పందన క్యూ.ఆర్ కోడ్ ద్వారా తెలియజేయండి అని కోరారు.