Markapur: మార్కాపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత - నిరసనకు దిగిన యువత
Markapur: మార్కాపురం కలెక్టరేట్లో వెలిగొండ ప్రాజెక్ట్ సమీక్ష సమావేశంలో ఉద్రిక్తత. మంత్రుల భేటీకి అనుమతించాలంటూ యువత నిరసన. సీఐ చొరవతో సద్దుమణిగిన వైనం.
Markapur: మార్కాపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత - నిరసనకు దిగిన యువత
మార్కాపూర్: మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనులు, పునరావాసం–పునరావాస ప్యాకేజీ (ఆర్అండ్ఆర్) పురోగతిపై మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
అయితే సమావేశానికి అధికార పార్టీకి చెందిన నాయకులను మాత్రమే లోపలికి అనుమతించడంపై యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు తమను కూడా చర్చలకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఆవరణలో నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు.
“మమ్మల్ని కూడా చర్చలకు లోపలికి అనుమతించాలి” అంటూ యువత పెద్దఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని గమనించిన టౌన్ సీఐ అల్తాఫ్ హుస్సేన్ జోక్యం చేసుకుని యువతతో మాట్లాడారు.
అనంతరం యువత ప్రతినిధులను మంత్రుల వద్దకు చర్చలకు అనుమతించడంతో పరిస్థితి సద్దుమణిగింది. తమ ప్రాంత సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించిన పోలీసుల జోక్యంపై యువత హర్షం వ్యక్తం చేసింది.